తమిళనాడులో మరోసారి హిందీ భాషపై పెద్ద చర్చ మొదలైంది. ఈ వివాదం డీఎంకే, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇటీవల బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకుంటే ఇకపై “గో బ్యాక్ మోడీ” అని కాకుండా “గెట్ అవుట్ మోడీ” అని నినదించాలని ఆయన సూచించారు. దీనికి ప్రతిగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సోషల్ మీడియాలో సవాల్ విసిరారు.
అన్నామలై ఉదయనిధి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ (ట్విట్టర్)లో “మీ డీఎంకే ఐటీ వింగ్ను ఉపయోగించుకొని ‘గెట్ అవుట్ మోడీ’ నినాదాన్ని రాత్రంతా ట్రెండ్ చేయండి. మేము ఉదయం 6 గంటల నుంచి ‘గెట్ అవుట్ స్టాలిన్’ ట్రెండ్ చేస్తాం. ఎవరిదీ ఎక్కువ ట్రెండ్ అవుతుందో చూద్దాం!” అని సవాలు విసిరారు. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ కరూరులో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధిని “అరేయ్” అని సంభోదించడం పెద్ద దుమారాన్ని రేపింది. డీఎంకే, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అన్నామలైకి ఉదయనిధి సవాల్
ఉదయనిధి స్టాలిన్ అన్నామలైకి సవాల్ విసిరారు. తన ఇంటిని ముట్టడిస్తానన్న అన్నామలై.. ధైర్యం ఉంటే అన్నాసాలైలోకి అడుగు పెట్టమనండి అని సవాల్ విసిరారు. “అన్నామలై గురించి మాట్లాడటానికి నాకు ఆసక్తి లేదు. భాషా హక్కుల కోసం తమిళనాడులో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు భాషపై ఎవరు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు. ఈ హిందీ భాషా వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తోంది.