అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. మొన్న వినాయక నిమజ్జన ఊరేగింపుతో రాజుకున్న ఈ వివాదం తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ(TDP) అగ్రనేతలు నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్రెడ్డి (JC Prabhakar Reddy)- కాకర్ల రంగనాథ్ (Kakarl Ranganath) మధ్య పేకాట పంచాయితీ మొదలైంది.
టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసులు దాడులు నిర్వహించగా, అక్కడ పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుల నుండి ₹89,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డవారిలో కాకర్ల రంగనాథ్ కూడా ఉండటం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇటీవలి కాలంలో కాకర్ల రంగనాథ్, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రంగనాథ్పై పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ధర్నా తరువాతే ఈ కేసులు బనాయించారని అసమ్మతి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో కాకర్ల రంగనాథ్, ఆయన సోదరుడు జయనాథ్ (Jayanath)లపై అక్రమ కేసులు నమోదు చేసినట్లుగా టీడీపీ అసంతృప్త గ్రూప్ ఆరోపిస్తోంది. రాజకీయ విభేదాలు పోలీస్ చర్యలకు దారితీసాయా? లేక పేకాట కేసు నిజంగానే పట్టుబడిందా? అనే దానిపై తాడిపత్రి రాజకీయాల్లో వేడెక్కిన చర్చ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదురే అవకాశం ఉన్నట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.








