రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఉన్న‌త హోదాలో ఉన్న ఇద్ద‌రు పోలీస్ ఉన్నతాధికారులు అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చిక్కారు. నిబంధ‌న‌కు విరుద్ధంగా న‌డుపుతున్న ఓ ఆస్ప‌త్రిపై న‌మోదైన కేసులో ఏకంగా రూ.25 లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయారు. ఈ కేసులో సీఐతో పాటు డీఎస్పీ కూడా అరెస్టు అయ్యారు.

ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ఓ ఆస్పత్రిపై సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, వ్యాపారం సజావుగా సాగాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారధి డిమాండ్ చేశారు. డీఎస్పీని కలిసి సెటిల్ చేసుకోమంటూ ఆ ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి సీఐ వీర రాఘవులు ఆఫర్ ఇచ్చారు.

డీఎస్పీని కలిసిన సదరు వ్యక్తి, రూ. 25 లక్షలు ఇవ్వలేనని ప్రాధేయపడటంతో కనికరించి రూ. 16 లక్షలు తీసుకునేందుకు అంగీకారించారు. ఒప్పుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై సీఐ, డీఎస్పీ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అనంత‌రం పూర్తి స్థాయిలో విచారించి, లంచం తీసుకుంటుండ‌గా సూర్యాపేట డీఎస్పీ, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నామ‌ని ఏసీబీ డీఎస్పీ జ‌గ‌దీష్ చంద‌ర్ తెలిపారు.

గతంలో కూడా సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నామ‌ని, ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామ‌ని వివ‌రించారు. డబ్బులు తీసుకుంటూ దొరకడమే కాదు. డిమాండ్ చేయడం కూడా నేరంలో భాగమేన‌ని, ఎవ‌రూ లంచాలు తీసుకోవ‌ద్ద‌ని ఏసీబీ డీఎస్పీ జ‌గ‌దీష్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment