సర్జరీ సక్సెస్..కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్

సర్జరీ సక్సెస్..కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన కుడి పొత్తికడుపు భాగంలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని సూర్యకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు.

“కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. సర్జరీ సాఫీగా జరిగింది, త్వరగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తిరిగి మైదానంలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాను” అని సూర్యకుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఆయన షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బంగ్లాదేశ్ సిరీస్‌తో రీఎంట్రీ!
ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది, ఇది ఆగస్టు 4 వరకు కొనసాగుతుంది. సూర్యకు విశ్రాంతి, ఫిట్‌నెస్ మెరుగుపరచుకోవడానికి దాదాపు 40 రోజుల సమయం ఉండటంతో ఈ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆగస్టు 26న మొదలయ్యే బంగ్లాదేశ్ టూర్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి టీ20 జట్టుకు కెప్టెన్‌గా మైదానంలోకి దిగనున్నారు. ఈ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి. కాగా, 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆయన వన్డేల్లో ఆడలేదు.

అదరగొట్టిన ఐపీఎల్ ప్రదర్శన
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్ సీజన్‌లో 717 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగుల రికార్డును సృష్టించారు. ఐపీఎల్‌లో వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25కు పైగా పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

భారత జట్టు 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా, సూర్యకుమార్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. అప్పటి నుండి ఆయన నాయకత్వంలో జట్టు మరింత కొత్తగా, బలంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment