టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju)కు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan)పై ఉన్న కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని, ఈ కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల మేరకు జగన్ బెయిల్ను రద్దు చేయాలని వేసిన పిటిషన్ను (Petition) రఘురామకృష్ణంరాజు ఉపసంహరించుకున్నారు.
వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ వెనక్కి తీసుకుంటామన్న రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది కోరగా, అందుకు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిల్ సతీష్ చంద్రమిశ్రాలతో కూడి ద్విసభ్య ధర్మాసనం అంగీకరించింది.
ట్రయల్ వేగంగా సాగాలని, మరో రాష్ట్రానికి జగన్ కేసులు బదిలీ చేయాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసు పర్యవేక్షణ చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని ధర్మాసనం సూచించింది.








