పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడిపై (Terrorist Attack) న్యాయ విచారణ (Judicial Inquiry) జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై న్యాయ విచారణ కోరడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ను దాఖలు చేసిన ఫతేశ్ కుమార్ సాగూ (Fatesh Kumar Sagu), ఇతరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), జస్టిస్ ఎన. కోటిశ్వరసింగ్ (Justice N. Kotiswarasingh)లతో కూడిన ధర్మాసనం, ఉగ్రవాద ఘటనల విచారణలో న్యాయమూర్తులు నిపుణులు కాదని స్పష్టం చేసింది. అలాంటి పరిసరాల్లో భద్రతా బలగాలు తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాల జోక్యం తగదని వ్యాఖ్యానించింది. భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే మీరు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా కనిపిస్తున్నదని కోర్టు పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది దేశానికి క్లిష్టమైన కాలమని, ఈ సమయంలో ప్రతి పౌరుడు ఉగ్రవాదంపై పోరాటంలో భద్రతా బలగాలకు మద్దతుగా నిలవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయవ్యవస్థను రాజకీయ ప్రేరణల కోసం వాడుకోవద్దని పిటిషనర్కు కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.