సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్ పాసింజర్ రైలులో అరకు రైల్వేస్టేషన్కి న్యాయమూర్తులు చేరుకుంటారు. నేరుగా హరిత వేలీ రిసార్టు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శించనున్నారు.
గిరి గ్రామదర్శిని ద్వారా గిరిజనుల జీవనశైలిని అవగాహన చేసుకుంటారు. స్థానిక గిరిజనుల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇతర సామాజిక అంశాలను పరిశీలిస్తారు. అనంతరం, అరకు లోయకు ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలను కూడా వారు సందర్శించనున్నారు. న్యాయమూర్తుల రాకకు ముందు రోజు నుంచే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి సురక్షిత వాతావరణాన్ని సృష్టించనున్నారు.