ఢిల్లీ (Delhi)లో వాతావరణ (Atmosphere) కాలుష్యం (Pollution) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీపావళి వచ్చిందంటే ఆ క్రాకర్స్ మోత, పొగతో ఢిల్లీ వాతావరణం దారుణంగా మారిపోతుంది. అయితే, దీపావళి (Diwali) సందర్భంగా సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. పటాకుల విక్రయంతో పాటు పేల్చేందుకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చింది. దీపావళికి గ్రీన్ పటాకుల (Green Firecrackers) విక్రయం, వాడకానికి అనుమతి ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణతో పాటు సాంప్రదాయ ఉత్సవాల ఆనందాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు మాత్రమే గ్రీన్ పటాకుల విక్రయం, వాడకం జరగాలని, సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే పటాకులు పేల్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా పటాకుల విక్రయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. కేవలం QR కోడ్ ఉన్న గ్రీన్ పటాకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలు ఏర్పాటు చేసి నిబంధనల అమలును పర్యవేక్షించాలనీ, ఉల్లంఘించిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది.
సాంప్రదాయ పటాకులు అక్రమంగా మార్కెట్లోకి వస్తూ వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అర్జున్ గోపాల్ కేసు తర్వాత ప్రవేశపెట్టిన గ్రీన్ పటాకులు ఉద్గారాలను తగ్గించాయని తెలిపింది. గ్రీన్ పటాకుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన నీరీ (NEERI) సంస్థను సుప్రీంకోర్టు ప్రశంసించింది.








