అరకులోయ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి పర్వతాలు, పాలధార జలపాతాలు, చల్లని మంచు కొండలు, పచ్చని కాఫీ తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది పక్కా గమ్యం. ఈ నెల 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అరకులోయ సందర్శించనున్నారు. ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని అల్లూరి జిల్లా జేసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
న్యాయమూర్తులు ఆదివారం విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరి ఉదయం 10.30కి అరకులోయ చేరుకోనున్నారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శించనున్నారని జేసీ తెలిపారు. న్యాయమూర్తుల రాకకు ముందు రోజు నుంచే పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి సురక్షిత వాతావరణాన్ని సృష్టించనున్నారు.