అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా (NASA) మరియు స్పేస్ఎక్స్ (SpaceX) కలిసి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంయుక్తంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే స్పేస్ఎక్స్ శనివారం ఉదయం 4.33 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ఈ ప్రయోగం ద్వారా ISS కి నలుగురు కొత్త వ్యోమగాములను పంపించారు. వీరిలో నాసాకు చెందిన అన్నే మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ జాక్సా (JAXA)కి చెందిన టకుయా ఒనిషి, రష్యా రోస్కోస్మోస్కు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.
సాంకేతిక సమస్యలపై విజయం
మూడు రోజుల క్రితం సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రయోగం వాయిదా పడింది. శుక్రవారం తెల్లవారుజామున స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించాల్సిన సమయంలో ఫాల్కన్-9 రాకెట్ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్లో సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ఈ మిషన్ను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, తాజా ప్రయోగం విజయవంతమవడంతో సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే మార్గం సుగమమైంది.
నాసా తెలిపిన సమాచారం ప్రకారం, మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్ మరియు ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ ISS నుంచి బయలుదేరే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే మార్చి 20 తర్వాత వారు భూమిని చేరుకుంటారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక ద్వారా ISS కి వెళ్లారు. అయితే, స్టార్లైనర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు, ఈ ప్రయోగంతో వారి తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అయ్యింది.








