ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్య సినీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్
ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ ఒక ప్రశ్న అడిగారు. మీరు ఏదైనా వదిలేయాలనుకుంటే ఏది వదిలేస్తారు..? అని అడగ్గా “సినిమాలు” వదిలేస్తానని వెంటనే సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యతో అక్కడ ఉన్న రామ్ చరణ్ మాత్రమే కాకుండా, ఇది విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు.
రామ్ చరణ్ వెంటనే మైక్ లాక్కొని అలా చేయరు లే అని సుకుమార్ సమాధానాన్ని సర్థిచెప్పారు. దర్శకుడు సుక్కు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సుకుమార్ ఇలా అనడానికి ఇటీవల జరిగిన పుష్ప 2 బెనిఫిట్ షో ఘటనలే కారణమని వాదిస్తున్నారు.
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలతో హీరో అల్లు అర్జున్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన విమర్శలతో వివాదం మరింత ఉద్రిక్తమైంది. ఈ సంఘటనలు సుకుమార్ను మానసికంగా ఎంతో బాధించాయట. రీసెంట్గా పుష్ప 2 సక్సెస్ మీట్లో ఈ సంఘటనపై మాట్లాడిన ఆయన తన బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే “సినిమాలు వదిలేస్తా” అని చేసిన ప్రకటన నెట్టింట వైరల్ అవ్వడం గమనార్హం.