ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగిచూసినట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తూ అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థినుల బాత్రూమ్ల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారని, గతంలోనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో పోలీసులు దీనిపై నిర్లక్ష్యంగా వహించారని విమర్శలున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గేట్లు తీసుకొని వచ్చి వాష్ రూములోకి తొంగు చూస్తుండటాన్ని విద్యార్థినులు గమనించారు. విద్యార్థినులు వెంటనే కేకలు వేయగా అగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు.
విద్యార్థినులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల నుంచి మరోసారి నిర్లక్ష్య సమాధానం రావడంతో అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసానికి కూతవేటు దూరంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న చోట విద్యార్థులకు రక్షణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విద్యార్థినుల బాత్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారని యువతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలోనూ విద్యార్థినుల రక్షణపై ఆందోళన మొదలైంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.








