విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న వైసీపీ తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. జనవరి 29న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫీజురింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండుతో ధర్నాకు పిలుపునిచ్చిన వైసీపీ.. 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో వాయిదా నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపుదలపై చేసిన నిరసన విజయవంతమైందని ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని బొత్స డిమాండ్ చేశారు. ఇక, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని చెప్పారు. ఎంతటి పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉందని బొత్స స్పష్టం చేశారు.