ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు అనుకూలంగా లేదనే చెప్పాలి. పలువురు స్టార్ క్రికెటర్లు (Star Cricketers) అనూహ్యంగా రిటైర్మెంట్లు (Retirements) ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేస్తున్నారు. ఈ ధోరణి న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ (Martin Guptill) రిటైర్మెంట్తో ప్రారంభమైంది.
అనంతరం భారత స్పీడ్స్టర్ వరుణ్ ఆరోన్, బంగ్లాదేశ్ బ్యాటింగ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్, భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, శ్రీలంక స్టార్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే, బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మదుల్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలికారు. ఇటీవల దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించగా, తాజాగా వెస్టిండీస్ సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
కీలక ఆటగాళ్ల సడెన్ షాక్లు
ఈ ఏడాది కొందరు ఆటగాళ్లు నిర్దిష్ట ఫార్మాట్ల నుంచి వైదొలగి సడెన్ షాక్లు ఇచ్చారు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. బంగ్లాదేశ్ ఆల్టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్ ముష్ఫికర్ రహీం ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ కాగా, వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించి మరో షాక్ ఇచ్చాడు.
క్రికెట్ ప్రపంచానికే అతి పెద్ద షాక్లు
ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అతి పెద్ద షాక్లు ఇచ్చారు. వీరిద్దరూ ఊహించని విధంగా టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం భారత క్రికెట్కు తీరని లోటుగా పరిగణించబడుతోంది. రోహిత్, కోహ్లీలు భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు కూడా గుడ్బై చెప్పారు. రోహిత్, కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ కూడా సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.