శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాల వెలికతీత పనులు 22వ రోజుకు చేరింది. మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్కర్నూలు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణలో శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత నెల 22న జరిగిన ప్రమాదం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ, 22 రోజులకు చేరుకున్నా ఇంకా ఏడుగురు కార్మికుల జాడ తెలియరావడం లేదు. ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమైన డీ1, డీ2 ప్రాంతాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రోబోస్తో సహాయక చర్యలు
సొరంగంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో మనుషుల ప్రవేశం సాధ్యపడని కారణంగా, హైదరాబాద్కు చెందిన ఆన్వి రోబోల సేవలను ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. రోబోలతో పాటు 30 హెచ్పీ సామర్థ్యంతో కూడిన పంపు మోటార్, వాక్యూమ్ ట్యాంక్ను టన్నెల్లోకి పంపి, గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించనున్నారు.ఈ చర్యలతో త్వరలోనే చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.