సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీ తేజ్ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించి, అతని తండ్రికి ధైర్యం చెప్పారు. కిమ్స్ వైద్యులు ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోందని, యాంటి బయోటిక్స్ చికిత్స ఆపివేశామని, కానీ ఇంకా వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబానికి భరోసా
డిసెంబర్ 4న “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప టీమ్ రేవతి కుటుంబానికి పెద్దగా అండగా నిలిచింది. అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చెరో రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించారు.
అల్లు అర్జున్ కాకుండా నిర్మాత దిల్ రాజు కూడా శ్రీ తేజ్ను పరామర్శించారు. వారు అందించిన మద్దతు శ్రీ తేజ్ కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించింది.