సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వంతు పూర్తయిందనుకుంటున్న తరుణంలో.. మరో సెలబ్రిటీపై గురిపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మహాశివరాత్రి రోజు నుంచి మొన్నటి వరకు పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులు నమోదైన విషయం తెలసిందే. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ శ్రీరెడ్డిపై ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పేరు శ్రీరెడ్డి (Sri Reddy). గతంలో ఆమె చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్ (Nara Lokesh)లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్లు పెట్టిన ఘటనలు తెలిసినవే. ఈ కారణంగా ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆమె విజయనగరం జిల్లా (Vizianagaram District)లోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
41ఏ నోటీసుల నేపథ్యంలో విచారణ
వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ఆమె చేసిన పోస్టులపై ఇటీవల తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Jana Sena) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్లపై విమర్శలు చేశారు. దాంతో పోలీసులు ఆమెకు 41A కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శ్రీరెడ్డి విచారణకు హాజరై, పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అవసరమైతే మళ్లీ పిలవవచ్చని పోలీసులు తెలిపారు.
మొత్తంగా ఆరు కేసులు..
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు శ్రీ రెడ్డి మీద మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు సమాచారం. ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల నేపథ్యంలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో మళ్లీ పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి రావడంతో పాటు శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానుల ఆగ్రహానికి లోనైన ఆమె.. ఇప్పుడు చట్టపరంగా చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది.