విశాఖపట్నం (Visakhapatnam) సింహాచల దేవస్థానానికి (Simhachalam Devasthanam) సంబంధించిన ప్రసాదం పులిహోర (Tamarind Rice)లో నత్త (Snail) కనిపించిన ఘటన తాజాఆ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో (Prasadam) నత్త ఉన్న విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో బయటపెట్టడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే తప్పు ఎలా జరిగింది, ప్రసాదంలోకి నత్త ఎలా వచ్చిందనే అంశాలపై విచారణ చేపట్టాల్సిన అధికారులు, ఆ విషయాన్ని వెల్లడించిన భక్తులపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనపై సింహాచల దేవస్థానం అధికారులు (Simhachalam Temple Authorities) గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంబంధిత భక్తులపై BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసులు(Cases) నమోదు చేశారు. ప్రసాదం నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తిన భక్తులనే నిందితులుగా మార్చడంపై భక్తులు (Devotees) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పును సరిదిద్దుకునే బదులు, నిజాన్ని బయటపెట్టిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వైసీపీ(YSRCP) విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ (Mazji Srinivas) మాట్లాడుతూ, “ప్రసాదంలో నత్త పడిందని చెప్పిన భక్తులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు కేసులతో భక్తులను ఎంతకాలం భయపెడతారు? దేవాలయాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలి, భక్తుల మనోభావాలను గౌరవించాలి” అని వ్యాఖ్యానించారు.
అలాగే, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. భక్తులపై నమోదు చేసిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు ఉండకూడదా అని ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానంలో గతంలో జరిగిన తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








