SLBC టన్నెల్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ఆరుగురి కోసం శ్రమిస్తూ తవ్వకాలు జరుపుతున్నాయి. అయితే గురువారం (ఏప్రిల్ 24) నాటికి టన్నెల్ లో పని చేసిన ఎక్స్కవేటర్లు బయటకు తీసుకువచ్చారు. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినప్పటికీ, ప్రమాదకరమైన జోన్లో మాత్రం ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు, సహాయక చర్యలను మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులో ఫిబ్రవరి 22న ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో సహాయక చర్యలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని సాంకేతిక కమిటీ తీసుకుంది. టన్నెల్ ఇన్లెట్ వైపు నుండి 13.6 కిలోమీటర్ల దూరం వెళ్లడం ప్రమాదకరమని కమిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం జలసౌధలో రెవెన్యూ శాఖ (విపత్తులు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశమైంది. సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీలోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా పాల్గొన్నారు.