శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ (SLBC) టన్నెల్ పనుల సమయంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయి పలువురు కార్మికులు గాయపడగా, ఇంకా పదిమంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల (Sunkishaala)లో రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
కమీషన్ల వేటలో పనుల పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని కేటీఆర్ విమర్శించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోవడం వల్లే వరుసగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. SLBC టన్నెల్ ప్రమాదం గురించి మాట్లాడుతూ లోపల చిక్కుకుపోయిన కార్మికులను యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షేమంగా బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు.
కమీషన్లకే ప్రాధాన్యం
కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘటనను ప్రస్తావిస్తూ, ఓ పిల్లర్ కుంగినప్పుడు నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు వరుస వైఫల్యాలపై ఎందుకు నోరుమెదపట్లేదని ప్రశ్నించారు. సుంకిశాల ఘటనలో వాస్తవాలను దాచిన ప్రభుత్వం, కనీసం SLBC ప్రమాదంపై పారదర్శక దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.