తన గాత్రంతో ఎంతోమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఎంతోమంది సింగర్స్ను ఎంకరేజ్ చేస్తూ వారినీ ఓ స్థాయిలో నిలిపారు. లెజెండరీ సింగర్ ఎస్పీబీ ప్రారంభించిన పాడుతా తీయగా షో ఎంతోమంది యువ గాయకులను వెలుగులోకి తెచ్చింది. అలాంటి వారిలో సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఒకరు. చిన్న వయసులోనే ఆమె ఈ ప్లాట్ఫామ్లో మెరిసి సంగీతప్రియుల మనసులు దోచుకుంది. ప్రస్తుతం ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్న ‘పాడుతా తీయగా’ తాజా సీజన్లో ప్రవస్తి మళ్లీ పాల్గొంది.
కిరవాణి పాటలకే హయ్యస్ట్ మార్కులు!
అయితే ఇటీవల ప్రవస్తి ఆరాధ్య ఎలిమినేషన్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎలిమినేషన్ సాధారణమైంది కాదంటూ.. ప్రవస్తి తన సోషల్ మీడియా ద్వారా షో నిర్వాహకులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. షోలో కీరవాణి పాటలు పాడిన వారికి మాత్రమే ఎక్కువ మార్కులు ఇస్తున్నారని, ఇతర పాటలు పాడితే తక్కువ మార్కులు వేస్తున్నారని ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. తాను జీవనోపాధి కోసం వివాహాలు, ప్రైవేట్ ఫంక్షన్లలో పాడతానని చెప్పినప్పుడు, షోకు న్యాయమూర్తులుగా వ్యవహించేవారు తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, అది తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించింది. సెట్లో బాడీ షేమింగ్ చేసిన జడ్జెస్, తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె ఆరోపించింది. తన ఎలిమినేషన్ ముందుగానే ప్లాన్ చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సింగర్ ప్రవస్తి మాటలను బట్టి కీరవాణి కబంధ హస్తాల్లో ఎస్పీబీ షో ఉన్నట్లుగా అర్థమవుతోందని పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
బెదిరింపులు, సోషల్ మీడియా వేధింపులు
షోలో జరుగుతున్న ఏకపక్ష తీర్పు, కించపరిచే సంఘటనల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి వెల్లడించిన తనపై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ద్వారా అనుచిత వ్యాఖ్యలు వస్తున్నాయని, బెదిరింపులు ఎదురవుతున్నాయని ప్రవస్తి మీడియాకు వెల్లడించింది. తనకు మద్దతుగా మాట్లాడిన ఇతర గాయకులతో సంబంధాలు కలిపి ట్రోల్ చేస్తున్నారని ఆమె వాపోయింది. “పాడుతా తీయగా వంటి షోలలో పాల్గొనాలనుకునే గాయకులకు ఒక్క మాట చెబుతున్నాను – మీకు రికమెండేషన్ లేకపోతే, జడ్జెస్ను వ్యక్తిగతంగా తెలియకపోతే అక్కడ న్యాయం జరగదు. పైగా మానసికంగా నష్టపోతారు” అని ప్రవస్తి ఆవేదనతో పేర్కొంది.
నెటిజన్ల నుంచి మద్దతు
ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ, జడ్జెస్ పక్షపాత తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సింగర్ సునీతతో పాటు ఇతర జడ్జిలపై కూడా ట్రోలింగ్ ఊపందుకుంది. ఎవరి సపోర్టు లేకుండా అవకాశాల కోసం ఎంతగానో కష్టపడిన చంద్రబోస్ లాంటి వ్యక్తులు అలా మిన్నకుండిపోకూడదని, జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాయనిర్ణేతలు అంటే నచ్చినవారికి మార్కులు వేయడం కాదు.. ప్రతిభ మెచ్చి మార్కులు వేయడమని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.