ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత టెస్టు జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, కొత్త కెప్టెన్ను నియమించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. తాజా సమాచారం ప్రకారం, యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను టెస్టు కెప్టెన్గా నియమించాలనే దిశగా సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు గిల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే దీనిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గిల్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ మెచ్చుకోదగ్గ స్థాయిలో కెప్టెన్సీ అందించాడు. ఇది సెలెక్టర్లపై మంచి ప్రభావం చూపిందని తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించినా, అతడి గాయాల సమస్యల నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం అనివార్యంగా మారిందని భావిస్తున్నారు.
ఇక వైస్ కెప్టెన్ పదవి కోసం రిషబ్ పంత్ పేరును పరిశీలిస్తున్న సెలక్టర్లు.. ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారని సమాచారం. ఇటీవల ఆయన ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, విదేశీ టెస్టుల్లో పంత్ ప్రదర్శన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకటించనున్న భారత టెస్టు జట్టులో శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.