ఐపీఎల్-2025 (IPL-2025) సీజన్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫైనల్కు చేరినా టైటిల్ చేజార్చుకున్నప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన నాయకత్వ పాటవంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ను దశాబ్దం తర్వాత ఫైనల్కు చేర్చిన అయ్యర్, వ్యక్తిగత ప్రదర్శనలోనూ రాణించాడు.
ఈ నేపథ్యంలో అయ్యర్కు అంతర్జాతీయ క్రికెట్లో (International Cricket) పెద్ద బహుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక (Indian Express Report) ప్రకారం, శ్రేయస్ అయ్యర్ టీమిండియా వైట్-బాల్ కెప్టెన్సీ రేసులో (White-Ball Captaincy Race) ముందుండగా, టీ20 జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమైన అయ్యర్, ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో టీ20 ఫార్మాట్లోనూ చోటు సంపాదించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో తెలిపారు.
ప్రస్తుతం టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), వన్డే జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టులకు శుబ్మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్లుగా ఉన్నారు. అయితే, మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ (BCCI) ఆలోచిస్తోంది. టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, త్వరలో వన్డేల నుంచి కూడా రిటైర్ (Retire) కావచ్చని, లేదా కనీసం కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్కు వన్డే కెప్టెన్సీ అప్పగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.