న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ఒక్క అవకాశమూ లభించకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ శస్త్రచికిత్స కారణంగా సిరీస్కు దూరం కావడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అయ్యర్కు, వరుసగా నాలుగు మ్యాచ్ల్లో చోటు దక్కలేదు.
వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇషాన్ కిషన్ గాయంతో ఆడలేకపోయినప్పటికీ, ఆ స్థానంలో అయ్యర్కు అవకాశం ఇవ్వకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్యాటర్ అవసరం ఉన్నప్పటికీ, టీమ్ మేనేజ్మెంట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సిరీస్కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా అందరికీ అవకాశం కల్పించిన టీమ్ ఇండియా మేనేజ్మెంట్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ అంశంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్కు ఎంపికైన ఆటగాళ్లందరికీ మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జట్టు కాంబినేషన్ను మార్చామని తెలిపారు.
“ఈ మ్యాచ్లో మేం కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాం. 180-200 పరుగుల లక్ష్య చేధనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే జట్టు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాం. ఈ మ్యాచ్లో ఓటమి వచ్చినా అది మాకు ఒక పాఠమే. ప్రపంచకప్ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వడమే మా లక్ష్యం” అని సూర్యకుమార్ వెల్లడించారు.







