డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం (Draksharamam)లో దారుణమైన అపచారం చోటుచేసుకుంది. ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) పర్వదినాన, వేలాది భక్తులు దర్శనానికి వచ్చే పవిత్ర క్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ పరిధిలోని కపిలేశ్వర ఘట్టం (Kapileswara Ghat)లో ఉన్న అతి పురాతన శివలింగాన్ని (Shiva Lingam) గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
సప్త గోదావరి నది తీరంలో, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ శివలింగం ధ్వంసం కావడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర నదీ తీరంలో ఇలాంటి అపచారం జరగడం హిందూ సమాజ భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తులు భారీగా తరలిచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భక్తులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో భద్రతను మరింత పెంచాలని కోరుతున్నారు.







