ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవచ్చని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేత వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉంటేనే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు రూల్ ప్రకారం సమయం కేటాయించబడుతుందని ఇటీవల వైసీపీ కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
హైకోర్టులో పిల్..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన హింసపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్బంగా దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు. చాలామందిని భయపెట్టి దాడులు చేశారన్నారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సుబ్రమణ్యస్వామి పిల్ వేశారు. తాను హైకోర్టులో వేసిన పిల్ మార్చి 12న విచారణకు వస్తుందన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇదొక చట్టపరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.