అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెల్లిగల్లు ప్రాథమిక పాఠశాలలో ప్రార్థనా సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు రోజువారీ ప్రార్థనలో పాల్గొంటుండగా, స్కూల్లోని చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి కింద పడింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్కూల్ టీచర్లు స్పందించి గాయపడిన విద్యార్థులను గాలివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందజేస్తున్నారు.
తరచూ ప్రమాదాలు ..
పాఠశాలల్లో చెట్టుకొమ్మలు విరిగి విద్యార్థులు గాయాల పాలవ్వడమే కాకుండా చికిత్స పొందుతు ప్రాణాలు విడిచిన సందర్భాలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో కూడా ఇలాంటి ఘటనలో ఒక వ్యక్తి, కర్నూలు జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
చెట్టుకూలి కన్నుమూసిన శ్రీలేఖ
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖ ఆదివారం మృతిచెందింది. పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ డే రోజు ఉదయం స్కూల్లోని చెట్టు కొమ్మ విరిగి తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది.







