దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. వంద కోట్ల రూపాయల ఖర్చుతో దావోస్ వెళ్లి.. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఏపీలో ఏ మొహం పెట్టుకొని అడుగు పెడుతున్నారంటూ నిలదీశారు.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై రోజా మీడియాతో మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్లో పారిశ్రామికవేత్తలు పారిపోయారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ వారు లక్షల కోట్లు పెట్టుబడులతో తిరిగి వస్తుంటే.. చంద్రబాబు మాత్రం కట్టుకథలతో వస్తున్నారన్నారు. దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తండ్రీ కొడుకులిద్దరూ సర్వనాశనం చేశారని మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు.
లోకేష్ రెడ్ బుక్ పాలన వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి రాష్ట్రానికి రావడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం, శాంతిభద్రతల క్షీణత కారణంగా పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు.
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని రోజా గుర్తుచేశారు. గతంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ. 13.5 లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు కుదిరాయని, ఇది రాష్ట్రానికి బలమైన ఆర్థిక ప్రగతిని సూచిస్తుందన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి ప్రాజెక్ట్లు, ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలు జగన్ పాలనపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారని వివరించారు.
దావోస్ పర్యటనకు భారీ బృందం, ఖర్చులతో వెళ్లినప్పటికీ రాష్ట్రానికి ఖాళీ చేతులతో తిరిగి రావడం అవమానమని రోజా అన్నారు. రాష్ట్రానికి నష్టం తలపెట్టే విధంగా చంద్రబాబు మరియు లోకేష్ వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతా పథకాలు, పారదర్శక పాలన, శాంతిభద్రతలు లేకపోవడమే పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణమన్నారు.