భారతీయ టెన్నిస్ దిగ్గజం, రెండు గ్రాండ్ స్లామ్ విజేత రోహన్ బోపన్న తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలికారు. 45 ఏళ్ల ఈ అథ్లెట్ పారిస్ మాస్టర్స్ 1000లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత, ట్విట్టర్ లో భావోద్వేగ పోస్ట్ ద్వారా తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించారు. “నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని 20 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఇప్పుడు నేను అధికారికంగా రాకెట్ను వదులుతున్నాను,” అని ఆయన పేర్కొన్నారు. చిన్న పట్టణం కూర్గ్లో శారీరకంగా బలపడేందుకు చెక్కలు కొట్టడం నుంచి ప్రపంచంలోని ప్రసిద్ధ మైదానాల్లో ఆడే వరకు సాగిన తన ప్రయాణం ఒక కలలా ఉందని, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో దక్కిన అత్యున్నత గౌరవం అని బోపన్న తెలిపారు.
బోపన్న టెన్నిస్ కెరీర్ ఎన్నో మైలురాళ్లతో నిండి ఉంది. ఆయన పలు ఏటీపీ టైటిల్స్ గెలిచారు, డేవిస్ కప్ మరియు ఒలింపిక్స్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజయం సాధించిన తర్వాత, డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలవడం ఆయన కెరీర్కే హైలైట్గా నిలిచింది. తాను పోటీ ఆటల నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని, అయితే భారతదేశంలో టెన్నిస్ అభివృద్ధికి మరియు చిన్న పట్టణాల నుంచి వచ్చే యువ క్రీడాకారుల్లో నమ్మకాన్ని కలిగించడానికి కృషి చేస్తానని బోపన్న ప్రకటించారు. భారత టెన్నిస్ అభిమానులకు ఒక గొప్ప యుగం ముగిసినా, బోపన్న సృష్టించిన లెగసీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.







