ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి తీసేందుకు రోబోలను టన్నెల్లోకి పంపించనున్నట్లు సమాచారం.
మొన్నటి నుండి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండగా, ఈ రోజు అన్వీ రోబో బృందం టన్నెల్లోకి ప్రవేశించనుంది. కార్మికుల మృతదేహాల ఆనవాళ్లు దొరకవచ్చని భావిస్తున్న ప్రాంతాలను నిపుణులు గుర్తించి, D1, D2 జోన్లుగా విభజించారు. వీటిలో D1 ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరమైన జోన్గా సూచించినట్లు తెలుస్తోంది. ఈ రోబోల ద్వారా కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు సహాయక బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన అనంతరం, తదుపరి చర్యలపై స్పష్టత రానుంది.