ప్రస్తుత కాలంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక పెద్ద వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. స్పాన్సర్షిప్లు, ప్రసార ఒప్పందాలు, ఇతర వాణిజ్య మార్గాల ద్వారా ఈ బోర్డులు వందల కోట్లు సంపాదిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ ధోరణి మరింతగా పెరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి లీగ్ల పుణ్యమా అని క్రికెట్ బోర్డుల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని క్రికెట్ బోర్డులు ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాయి. దీనికి ప్రధాన ఉదాహరణ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI).
బీసీసీఐ: ప్రపంచ క్రికెట్ను శాసించే శక్తి
బీసీసీఐ (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు (Most Rich Cricket Board) కావడమే కాకుండా, ప్రపంచ క్రికెట్ మొత్తాన్నీ శాసిస్తుంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత బీసీసీఐ ఆదాయం (BCCI Revenue) అమాంతం పెరిగింది (Increased). 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుండి బీసీసీఐ ఆర్థికంగా అనూహ్య వృద్ధిని సాధించింది. ధనార్జన విషయంలో ఏ ఇతర దేశ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. తాజా లెక్కల ప్రకారం, బీసీసీఐ నికర విలువ రూ. 19,052 కోట్లుగా ఉంది.
ఇతర బోర్డులతో పోలిక
బీసీసీఐ ఆదాయంతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం పది శాతం కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం, బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా నిలవగా, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ బోర్డు (Cricket Board) అతి పేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా, ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ను కేవలం ఒక క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏనాడూ ఆదాయ వనరుగా పరిగణించలేదు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే, న్యూజిలాండ్ మాత్రం క్రీడా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది.
బీసీసీఐ ఆదాయ వనరులు
భారతదేశంలో క్రికెట్ అనేది ప్రతి పౌరుడి జీవితంలో ఒక భాగం. ఇదే బీసీసీఐకి అతి పెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు చేస్తాయి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయం చిన్న దేశాల క్రికెట్ బోర్డుల మొత్తం ఆదాయం కంటే చాలా ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్లోనే జరిగే మ్యాచ్ల టిక్కెట్ల అమ్మకాలు, ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరులు. ఇలా బీసీసీఐ బహుళ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా కొనసాగుతోంది.
టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డులు :
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI): రూ. 19,052 కోట్లు
క్రికెట్ ఆస్ట్రేలియా: రూ. 684 కోట్లు
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB): రూ. 510 కోట్లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB): రూ. 476 కోట్లు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB): రూ. 441 కోట్లు
క్రికెట్ సౌతాఫ్రికా: రూ. 406 కోట్లు
జింబాబ్వే క్రికెట్ బోర్డు: రూ. 329 కోట్లు
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC): రూ. 173 కోట్లు
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI): రూ. 129 కోట్లు
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC): రూ. 77 కోట్లు