జగన్‌పై జనసేన ఎమ్మెల్యే స్కిట్ వెనుక ఆంతర్యం అదేనా?

జగన్‌పై జనసేన ఎమ్మెల్యే స్కిట్ వెనుక ఆంతర్యం అదేనా?

జనసేన (JanaSena) ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఇటీవల ఎమ్మెల్యేల కల్చరల్ ఈవెంట్‌లో స్కిట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu), జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) పగలబడి నవ్వేలా చేసిన వీడియోలు నెట్టింట వైరల్ (Viral Video) అయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) వ్యక్తిత్వంపై జోకులు వేయడం సబబేనా అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. అయితే, వ్యక్తిగతంగా జగన్‌పై ఇంతగా అటాక్ చేయడానికి కారణాలు మరేమైనా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి కూటమి వర్గాలు.

ఇటీవల శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆఖర్లో కల్చరల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు సభ్యులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఉపసభాపతి రఘురాకృష్ణరాజు దుర్యోధనుడి గెటప్ వేశారు. జనసేన మంత్రి కందుల దుర్గేష్ సైతం పౌరాణిక పాత్ర పోషించారు. అయితే, ఇందులో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేసిన ఫర్ఫార్మెన్స్ పై అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ స్కిట్ లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కించపరిచేలా వ్యవహరించారంటూ అటు వైసీపీ సానుభూతిపరులు, ఇటు నెటిజన్లు సైతం కామెంట్లతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, జగన్‌పై వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేకపోయినా ఆయన ఇలా స్కిట్ చేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నాయి కూటమి వర్గాలు.

ఇంతకీ విషయం లోపలికి వెళ్తే.. సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే కాగానే తన నియోజకవర్గంలో తనదైన స్టైల్లో వసూళ్లు, బెదిరింపులకు దిగారని భోగట్టా. కమీషన్ల వసూళ్ల కోసం కూటమి అధికారంలోకి రాగానే కోకో కోలా కంపెనీతో బేరం పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మామూళ్లు ఇవ్వకపోతే ఉత్పత్తులు బయటకెళ్లవంటూ హెచ్చరికలు కూడా చేశారట.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. ఇంతలోనే సదరు బాధిత కంపెనీ ప్రతినిధులు అటు బీజేపీ అధిష్టానానికి, ఇటు సీఎం చంద్రబాబుకు విషయం చేరవేశారట. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం జనసేన ఎమ్మెల్యేపై విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందిందట. దీంతో ఖంగారుపడ్డ సుందరపు.. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. అందులో భాగంగానే కల్చరల్ ఈవెంట్ వేదిక అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తనపై విచారణ జరగకుండా సీఎం చంద్రబాబును, తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిత్వంపై కాస్త దిగజారి జోకులేయడం ద్వారా వాళ్లు ఆనందపరవశులవుతారని, తద్వారా తన పర్ఫార్మెన్స్ పై మంచి మార్కులు వస్తాయని ఆయన ఇలా చేసినట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. అయితే, తన లొసుగులను కప్పిపుచ్చుకోవడానికి మాజీ సీఎంపై స్థాయికి మించిన విమర్శలు చేయడం సబబు కాదంటూ జనసేన పార్టీలోనే కొందరు ప్రముఖులు అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment