భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ముంబై క్రికెట్ లో అద్భుత సేవలు
మిలింద్ రేగే 1970లలో ముంబై తరఫున 52 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి, 126 వికెట్లు తీశారు. రిటైర్మెంట్ తర్వాత, ముంబై క్రికెట్ అసోసియేషన్ లో సెలక్టర్, మేనేజింగ్ కమిటీ మెంబర్, కామెంటేటర్, అడ్వైజర్ లాంటి కీలక భాద్యతలు నిర్వహించారు. 2006లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణలోనూ కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా నిలిచిన మిలింద్ రేగే మరణం ముంబై క్రికెట్ కు తీరని లోటు.
మైదానంలో కన్నీటి నివాళి
నాగ్పూర్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ముంబై, విదర్భ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మిలింద్ రేగే కు నివాళులర్పించారు. ముంబై కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ, “మిలింద్ సార్ మా అందరికీ మార్గదర్శకులు. ఆయన అందించిన మద్దతు, ప్రోత్సాహం అమూల్యమైనవి. ముంబై క్రికెట్ లో ఆయన లెగసీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” అని భావోద్వేగం వ్యక్తం చేశారు.