రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం భూకబ్జా ఆరోపణలతో చిక్కుల్లో పడింది. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించుకుందని ఆరోపిస్తూ పేదలు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పేదల ఆందోళనకు సీపీఎం (CPM) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి సర్వే నంబర్లు 189, 203లలో మొత్తం 20 ఎకరాలను 577 మందికి ప్రభుత్వం కేటాయించింది. అయితే, 2007 నుంచే ఈ భూములను రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్లాట్లను చూపించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన
ఇన్నేళ్లుగా తమకు రావాల్సిన హక్కును పొందలేక పోయిన లబ్ధిదారులు, ఫిల్మ్ సిటీ యాజమాన్యం దౌర్జన్యాలపై గళమెత్తారు. తమ స్థలాల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధితులు సీపీఎం నాయకత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను తమకు తిరిగి అప్పగించాలని కలెక్టర్ను కోరారు.
సీపీఎం ఆగ్రహం
రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం మండిపడ్డింది. ప్రశ్నించిన రాజకీయ నేతలను వేధిస్తోందనన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అరాచకాలను ఎండగడుతూనే ఉంటామని సీపీఎం స్పష్టం చేసింది. ఫిల్మ్ సిటీ గోడలు బద్ధలు కొట్టి భూములు స్వాధీనం చేసుకుంటామని సీపీఎం వివరించింది. ఫిల్మ్ సిటీ ఎన్నినిర్బంధాలు పెట్టినా పోరాటం ఆపేది లేదని హెచ్చరించింది.