భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) అధ్యక్ష పదవిలో కీలక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) రిటైర్మెంట్ నేపథ్యంలో.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు (BCCI Vice President) రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. బీసీసీఐ రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ఠ వయస్సు పరిమితి 70 సంవత్సరాలు. 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ ఈ ఏడాది జూలై 19న 70వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీంతో ఆయన పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికీ, బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, బిన్నీ పదవీకాలం ముగియగానే రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చే మూడు నెలల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. రాజీవ్ శుక్లా గతంలో ఐపీఎల్ (IPL) చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయనకు క్రికెట్ పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు తాత్కాలికంగా అధ్యక్ష పదవిని ఆయనకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగుతారా? లేక ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవుతారా అన్నది త్వరలోనే తేలనుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాజీవ్ శుక్లానే తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఒప్పంద ప్రకటనలు రాకపోయినప్పటికీ, బోర్డు లోపలి చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధికారిక ప్రకటన కోసం భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.