గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజా సింగ్ (Raja Singh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)అని చెప్పుకోవచ్చని, రాబోయే మూడేళ్లు గోషామహల్కు తానే ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. కొన్ని తప్పులు తన వల్ల జరిగాయని, అయితే సోషల్ మీడియా మరికొన్ని తప్పుడు ప్రచారాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారని చెబుతూ, కొందరు తమ పార్టీ వాళ్ళే మీడియాకు రాజా సింగ్ లీక్లు ఇస్తున్నారని ఢిల్లీ(Delhi)కి ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
ఉప ఎన్నిక రాదు, బీజేపీ నా ఇల్లు:
గోషామహల్లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. తాను బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా (Resignation) చేశానని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఉప ఎన్నిక జరగనప్పుడు, ఇక్కడ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కొందరు తమ పార్టీ వాళ్ళు కూడా పాత బట్టలు ఐరన్ చేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. “బీజేపీ నా ఇల్లు. రాజా సింగ్ రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్లిపోతాను” అని ఆయన బలంగా చెప్పారు.
హైకమాండ్తో భేటీకి ప్రయత్నం:
“నేను బీజేపీ హై కమాండ్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా అధిష్ఠానం పిలుస్తుందనే నమ్మకం ఉంది” అని రాజా సింగ్ తెలిపారు. ఇతర పార్టీలలో తాను ఉండలేనని, ఆ పార్టీలకు తాను మ్యాచ్ కానని స్పష్టం చేశారు. తన వెనుక ఎవరూ లేరని, గతంలో 14 నెలలు బీజేపీ నుండి సస్పెండ్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. తన శత్రువులు పార్టీలో ఉన్నారని, ఇతర పార్టీలలో కూడా ఉన్నారని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీకి నష్టమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, శివసేన, జనసేన ఈ మూడు పార్టీలు తమ అలియన్స్ పార్టీలేనని రాజా సింగ్ అన్నారు. ధర్మ ప్రచారం, నియోజకవర్గ ప్రజలే తన ముందున్న అంశాలని చెప్పారు. “నా లాంటి వాళ్ళు వస్తారు పోతారు, బీజేపీ ఉండాలి” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న వారికి ఇవాళ కాకున్న రేపు అయినా బుద్ధి వస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.