పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ ప్రాంతంలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మూడు వారాలుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం రైతు నాయకుడికి ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగితే ఏంటని పంజాబ్ అధికారులను హెచ్చరించింది.
నిరాహార దీక్ష చేపట్టిన జగ్జీత్ సింగ్కు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంపై పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. “రైతు నిరసనలను అణచివేయడానికి కాదని, ఆయన భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు” కోర్టు పేర్కొంది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు? అనే సందేహాలను కోర్టు వ్యక్తీకరించింది.
రైతుల సమస్యలపై సూచనలు చేసేందుకు వచ్చే అన్నదాతలు, వారి ప్రతినిధుల కోసం న్యాయస్థానం తలుపులు తెరిచే ఉంటాయని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఖనౌరీ సరిహద్దు శిబిరం వద్ద ఆమరణ నిరసనకు దిగిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్, రైతుల ప్రతినిధులతో ఎన్నిసార్లు ప్రయత్నించినా కోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో చర్చలకు అంగీకరించడంలేదని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. ధర్మాసనం స్పందిస్తూ.. రైతులు తమ డిమాండ్లను నేరుగా లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చని సూచించింది.
పంటలకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా నవంబర్ 26 నుంచి దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సుప్రీం కోర్టు నుంచి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.