పులివెందులలో టీడీపీ నెగ్గింది. ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కాండిడెట్లు గెలుపొందారు. పులివెందుల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి 6,035 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి హేమంత్రెడ్డికి కేవలం 683 ఓట్లు రావడం సంచలనంగా మారింది.
పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 10,601 ఓట్లు ఉండగా, అందులో 7,814 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో టీడీపీకి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. మాజీ సీఎం సొంత ఇలాకాలో వైసీపీకి అతి తక్కువ ఓట్లు పోలవ్వడం నమ్మశక్యం కాని నిజం. కనీసం వెయ్యి ఓట్లు కూడా దాటకపోవడంతో ఓటింగ్ సరళిపై అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు పులివెందుల ఓటర్లు.
పోలింగ్ రోజు అనేక మంది ఓటర్లు చేతికి సిరా చుక్క వేసుకోకుండానే వెనుదిరిగిన వీడియోలు, ఎర్రపల్లె, మొట్నుతలపల్లి, కనంపల్లె బూత్లు క్యాప్చర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కనంపల్లె ప్రాంత వాసులు ఓటు హక్కు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న వీడియోలను సైతం నిన్న ప్రెస్మీట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రదర్శించారు. మా చేతికి సిరా చుక్క లేదు చూడండి అని కనంపల్లె మహిళా ఓటర్లు, మా స్లిప్పులు తీసుకొని వెనక్కి పంపించారని ఆర్.తుమ్మలపల్లె ఓటర్లు గగ్గోలు పెట్టారు.
స్థానికేతరులు వచ్చి పులివెందులలో ఓట్లు వేశారని వారి ఆధారాలతో సహా వైసీపీ బయటపెట్టింది. ఏకంగా కలెక్టర్ సమక్షంలో జమ్మలమడుగుకు చెందిన సందీప్ అనే వ్యక్తి ఓటు వేయగా, జగన్ ప్రెస్మీట్ అనంతరం కలెక్టర్ ఆ పోస్ట్ను డిలీట్ చేసేశారు. పోలీసుల సహకారంతో పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకొని టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందనేది వైసీపీ ఆరోపణ.
అయితే, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై పెద్ద దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిన్న వైఎస్ జగన్ కూడా తన ప్రెస్మీట్లో ఏపీ జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్కు, కౌంటింగ్కు మధ్య 12.5 % డిఫరెంట్ ఎలా ఉంటుందనే లాజిక్ను మరోసారి ప్రస్తావించారు. 12.5 % ఇప్పుడు హాట్ టాపిక్గా ఉండగానే, పులివెందులలో బ్యాలెట్ పేపర్పై జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 6,735 ఓట్లు రావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిగ్గింగ్ జరలేదని టీడీపీ వాదించుకునేందుకైనా ఒక వెయ్యి ఓట్లను వైసీపీ అభ్యర్థికి గుద్దితే బాగుండ్ను అని కొందరు పులివెందుల ప్రజలే సెటైర్లు వేయడం గమనార్హం.