ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. రూ.2.08 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, పలు ప్రాంతాల్లో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, చిలకలూరిపేటలో ఆరు లైన్ల రహదారిని పీఎం మోదీ ప్రారంభించారు.
విశాఖలో రోడ్ షో
విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వరకు రోడ్ షో కొనసాగింది. ఈ రోడ్ షోలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు : చంద్రబాబు
విశాఖ సమావేశంలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ‘మోదీ అంటే ఓ నమ్మకం, ఓ విశ్వాసం అని చెప్పారు. రూ.2 లక్షల కోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే ఈరోజు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారని, వచ్చిన వెంటనే ఎన్నో పెట్టుబడుల్ని అందించారన్నారు. ఆయన దేశం మెచ్చే నాయకుడు కాదని, ప్రపంచం మెచ్చే నాయకుడని ప్రశంసించారు.
దేశాన్ని గొప్పగా మార్చేందుకు మోదీ ప్రయత్నం : పవన్
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ప్రధాని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసించారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని చెప్పారు. NDA ప్రభుత్వం గెలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. భారత్ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.








