దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 17 మంది బాలలకు ఈ ఏడాది ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వీరిలో 10 మంది బాలికలు, 7 మంది బాలురు ఉన్నారు. మొత్తం 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఈ ప్రతిభావంతుల ఎంపిక జరిగింది.
ఈ అవార్డు గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు. వారి కృషి సమాజానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ఏపీకి చెందిన జెస్సీ రాజ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జెస్సీ రాజ్ క్రీడా విభాగంలో తన ప్రతిభను చాటి ఈ పురస్కారాన్ని పొందారు. తమిళనాడుకు చెందిన జననే నారాయణన్ (ఆర్ట్ అండ్ కల్చర్), కర్ణాటకకు చెందిన సింధూర రాజా (ఇన్నోవేషన్ విభాగం), పంజాబ్కు చెందిన సాన్వీ సూద్ (స్పోర్ట్స్ విభాగం) వంటి ఇతర ప్రతిభావంతులు కూడా ఈ అవార్డులతో గౌరవించబడ్డారు.
సాహసం, సాహిత్యం, శాస్త్రం.. ప్రతిభకు గౌరవం
వివిధ విభాగాల్లో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ పురస్కారాలను అందుకున్నారు. కశ్మీరీ సంగీతంలో 12 ఏళ్ల అయాన్ సజ్జాద్, సంస్కృత సాహిత్యంలో 17 ఏళ్ల వ్యాస్ ఓం జిగ్నేష్, జూడో ప్లేయర్ హేంబటి నాగ్, చెస్ ప్లేయర్ అనీశ్ సర్కార్ వంటి బాలలు ఈ పురస్కారాలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఈ పురస్కార గ్రహీతలు భవిష్యత్తులో మరెంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. పిల్లల్లో దాగిన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మన దేశ సంప్రదాయంలో భాగం అని పేర్కొన్నారు.