ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన మహా కుంభమేళా (Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బోటు యాత్ర నిర్వహించిన రాష్ట్రపతి మార్గమధ్యంలో వలస పక్షులకు ఆహారం అందించారు. త్రివేణి సంగమానికి చేరుకున్న తర్వాత పుణ్యస్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెరిగిన భక్తుల రద్దీ
144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13న ప్రారంభమైంది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మేళాకు భారీగా తరలివస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహోత్సవంలో ఇప్పటికే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది.