భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గర్భిణీగా (Pregnant) ఉన్న భార్యను కట్టుకున్న భర్త (Husband) బండరాయి (Stone) తో దాడికి దిగాడు. గర్భంతో ఉన్న భార్యను కిందపడేసి రాయితో దాడి చేశాడు. ఇంతటి దారుణమైన సంఘటన హైదరాబాద్ (Hyderabad) లో గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతంలో ఈనెల 1వ తేదీన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతోంది.
ప్రేమ పెళ్లి.. అనంతరం వేధింపులు
వికారాబాద్కు చెందిన ఎండి. బస్రత్ (M.D. Basrath) (32) హఫీజ్పేట్ లోని ఆదిత్యనగర్లో నివసిస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. 2023లో అజ్మేర్ దర్గాకు వెళ్తూ బస్సులో పశ్చిమ బెంగాల్కు చెందిన షబానా పర్వీన్ (Shabana Parveen) (22)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, 2024 అక్టోబర్లో ఇద్దరూ కోల్కతా (Kolkata) లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం షబానాను హైదరాబాద్కు తీసుకొచ్చాడు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాత్రే హింస
ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భవతి. మార్చి 29న వాంతుల కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆసుపత్రి వెలుపలికి వచ్చిన వెంటనే భార్యాభర్తల మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్తా పెద్దగా మారింది.
నడిరోడ్డులోనే ఘోర దాడి
మాటామాటా పెరిగి హద్దులు దాటి పోవడంతో బస్రత్ ఆగ్రహంతో షబానాపై ఒక్కసారిగా కాలితో తన్నాడు. షబానా కింద పడిన తర్వాత అక్కడే ఉన్న బండరాయిని తీసుకొని ఆమె తలపై, శరీరంపై పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.