తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాజకీయంగా కీలక అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించిన విజయ్.. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (PK)తో భేటీ అయ్యారు. మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు రాజకీయాలు, టీవీకే, ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై చర్చించారు.
సమావేశం అనంతరం ప్రశాంత్ కిశోర్ టీవీకే పార్టీ ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను విజయ్ అనుచరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాడు అధికార పార్టీ డీఎంకే, అన్నా డీఎంకే, బీజేపీ ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార డీఎంకేతో కమల్ హాసన్ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.