జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదని, అది కేవలం పవన్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్థాపించుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేఏ పాల్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టడాన్ని కేఏ పాల్ తప్పుపట్టారు. జనసేన పార్టీలో నిజంగా కష్టపడే వారికి అవకాశాలు లేవని ఆరోపించిన కేఏ పాల్, “జనసేన పార్టీ మీ సేవలను గౌరవించడం లేదు. మీరు నిజమైన ప్రజాసేవ చేయాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరండి” అంటూ జనసైనికులను ఆహ్వానించారు.
జనసేన పార్టీ ప్రజల కొరకే.. ప్రజల తరఫున ప్రశ్నించేందుకే.. ప్రజలకు న్యాయం చేసేందుకే అని చెప్పిన పవన్ కళ్యాణ్.. 21 మంది ఎమ్మెల్యేల తరఫున ఒక్క ఎమ్మెల్సీ సీటు వస్తే అది పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వకుండా తన అన్న నాగబాబుకు కేటాయించాడన్నారు. పార్టీ కోసం కష్టపడిన లక్షల మంది ఉంటే వారికేమైనా ఇస్తున్నాడా? కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన నాయకులకేమైనా ఇస్తున్నాడా? అని ప్రశ్నించారు.
జనసేన పార్టీ అవినీతి, కుటుంబ పార్టీ అని తాను ముందే చెప్పానని కేఏ పాల్ అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు కాకుండా తన అన్న, హైదరాబాద్లో ఉన్న యాక్టర్ను తీసుకువచ్చి ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టాడన్నారు. పవన్ కళ్యాణ్ మారడని, ఆ పార్టీ బయటకి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరండి, కుల, అవినీతి, అగ్రవర్ణ పార్టీకి గుడ్ బై చెప్పండి అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.