రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ షూటింగ్ నిన్న హైదరాబాద్లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ ఇవాళ నుంచి ‘స్పిరిట్’ సెట్స్లో జాయిన్ అయ్యారు.
ప్రభాస్ తన షెడ్యూల్లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, చిత్ర బృందం న్యూ ఇయర్ విరామం తీసుకోనుంది.
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ‘స్పిరిట్’ చిత్ర యూనిట్ అంతా విదేశాలకు పయనం కానుంది. సినిమా యొక్క రెండో షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభంలో మెక్సికోలో మొదలుకానుంది. మెక్సికోలో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా తనదైన మార్కుతో ఈ చిత్రాన్ని ఎలా రూపొందిస్తారనే దానిపై ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.








