ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరయ్య చౌదరి ఒంట్లో ఏకంగా 40కి పైగా కత్తిపోట్లు దింపింది సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడేనని పోలీసుల విచారణలో బయటపడినట్లుగా సమాచారం. హత్యకు కారణం పార్టీలో ఆధిపత్య పోరు, వ్యాపార సంబంధిత లావాదేవీలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి హత్య వెనుక అదే ప్రాంతానికి చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి హస్తం ఉన్నట్లుగా ప్రకాశం జిల్లా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. సుపారీ గ్యాంగ్తో వీరయ్య చౌదరిని అతికిరాతకంగా చంపించినట్లుగా ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సుపారీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి. వీరయ్య చౌదరి హత్యకు బలమైన కారణం ఉందని, భూ వివాదాలు, రైస్, మద్యం వంటి వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక వివాదాలపై విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరయ్య చౌదరిని హత్య చేయించిన దేవేంద్రనాథ్ చౌదరి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా, రహస్య ప్రదేశంలో అతన్ని విచారణ కొనసాగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, వీరయ్య చౌదరి హత్య జరిగిన వెంటనే నిజానిజాలు తెలియకుండా, టీడీపీ నేత హత్యను ప్రత్యర్థి పార్టీకి అంటగట్టాలని కొన్ని మీడియా ఛానళ్లు ప్రయత్నాలు చేయగా, పోలీసుల సమగ్ర విచారణతో ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు అయ్యిందంటున్నారు స్థానికులు. హత్య చేసిన దేవేంద్రనాథ్ చౌదరి సైతం తెలుగుదేశం పార్టీకి చెందిన నేత కావడం గమనార్హం. సొంత పార్టీ నేతే వీరయ్య చౌదరిని హత్య చేయించడం తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. కాగా, సుపారీ గ్యాంగ్ కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.