అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఏడేళ్ల బాలుడిని (7-year-Old Boy) కిడ్నాప్ (Kidnap) చేసి అత్యంత దారుణంగా హత్య (Murder) చేసిన నిందితుడు సర్వేష్పై (Sarvesh) పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ (ఘటనా స్థల పరిశీలన) చేస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఈ చర్య చేపట్టినట్టుగా చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే?
యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు హేమచంద్రను (Hemachandra), డబ్బు కోసం సొంత బావ అయిన సర్వేష్ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కోన ఉప్పలపాడు సమీపంలోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో సర్వేష్ అక్కడ పడి ఉన్న బీరు బాటిల్తో సీఐ రామసుబ్బయ్య (Ramasubbayya), మరో కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో సీఐ, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి.
ఆత్మరక్షణ కోసం కాల్పులు
నిందితుడు పారిపోతుండటం, పోలీసులపై దాడికి దిగడంతో అప్రమత్తమై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని గాయపడిన పోలీసులు చెబుతున్నారు. మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా, అందులో నాలుగు రౌండ్లు గాలిలోకి, రెండు రౌండ్లు నిందితుడి మోకాళ్ల కిందకు తగిలాయి. తీవ్రంగా గాయపడిన సర్వేష్ను వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ, అడిషనల్ ఎస్పీ వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన సీఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ను పరామర్శించారు.








