చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టెర్మినల్ పూర్తి చేసినందుకు, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. బందర్ పోర్టు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటుతో రాష్ట్ర అభివృద్ధికి కీలకమవుతుందని, తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి ఒక ముఖ్య కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి కూడా అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు.
మరోవైపు, రీజినల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రగతిని అందించడమే కాకుండా, రీజినల్ రైల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ప్రధాని కోరుకుంటున్న 5ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని, తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందని చెప్పారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 1ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కోరారు.