దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్ష యాత్ర తరువాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ “స్టార్ లైనర్” లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యల కారణంగా వారి తిరుగు ప్రయాణం ఆలస్యం అయ్యింది.
తాజాగా, వీరు నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 ద్వారా ISS నుంచి భూమి మీదకు తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సునీతా విలియమ్స్కి ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. ఇటీవల రెండుసార్లు అమెరికా పర్యటనల సమయంలోనూ అమెరికా ప్రెసిడెంట్లు జో బైడెన్, తరువాతి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీలో కూడా సునీతా శ్రేయస్సు గురించి చర్చించుకున్నానని మోడీ లేఖలో పేర్కొన్నారు.
“మీరు చూపిన పట్టుదల, ధైర్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. 1.4 బిలియన్ల భారతీయులు మీ విజయానికి గర్వపడుతున్నారు” అని మోడీ తన లేఖలో రాశారు. అంతేకాకుండా, “మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నా, మా హృదయాలు మీతోనే ఉన్నాయి” అని స్పష్టం చేశారు. సునీతా భూమికి తిరిగి వచ్చిన తర్వాత భారత్ రావాలని మోడీ తన లేఖలో కోరారు.