2025లో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు, సరిహద్దు సమస్యలపై తీసుకున్న తాజా నిర్ణయాలతో కొంతమేర చల్లబడుతున్నాయి. చైనాలో ఆగస్టు-సెప్టెంబర్ నెలలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమ్మిట్లో పాల్గొనడానికి మోదీ వెళ్లే అవకాశం ఉంది.
రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో మోడీ, జి జిన్పింగ్ మధ్య సమావేశం ఈ తాజా పరిణామాలకు దోహదపడినట్లు అనిపిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల చైనాలో జరిపిన చర్చలు కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు కొత్త సంకేతాలు ఇస్తున్నాయి.
భారత్లోకి రానున్న ప్రపంచ నేతలు
2025లో భారతదేశం గణనీయమైన అంతర్జాతీయ పర్యటనలకు వేదిక కానుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత్కు రానున్నారు. ఇదే కాక, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చే అవకాశం ఉంది.
గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సియాంటో ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఫిబ్రవరిలో మోదీ ఫ్రాన్స్ పర్యటన చేస్తారని, అలాగే జపాన్లో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఆసియన్ సమ్మిట్ మలేషియాలో, G20 సమ్మిట్ దక్షిణాఫ్రికాలో జరగనుండగా, మోదీ ఆ దేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల ద్వారా భారతదేశం అంతర్జాతీయ వేదికపై తన దౌత్య ప్రాభవాన్ని మరింతగా పెంచుకోనుందని అంచనా.








